జనసేన కార్యకర్తలకు విజ్ఞప్తి, పంచాయతీరాజ్ వ్యవస్థ ఫై ప్రతిఒక్కరు అవగాహనా కల్పించుకోవాలి ఆశిస్తూ…మన గ్రామాన్ని మనం కాపాడుకుందాం….

ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్ వ్యవస్థ.

గ్రామస్థాయిలో అమల్లో ఉండే అతి ప్రాచీన పాలనా వ్యవస్థే పంచాయతీ. దీన్నే స్థానిక స్వపరిపాలనా సంస్థల వ్యవస్థ, పంచాయతీరాజ్ వ్యవస్థ అని కూడా అంటారు. గ్రామ రాజ్యం ద్వారా రామరాజ్యం ఏర్పాటు చేయాలనిగాంధీజీ కలలు కన్నారు.ఆయన దృష్టిలో ప్రతి గ్రామపంచాయతీ ఒక చిన్న గణతంత్ర రాజ్యం. దేశాభివృద్ధికి మూలం గ్రామాభివృద్ధే. అందువల్ల గ్రామాభ్యుదయానికి గ్రామపంచాయతీల ఏర్పాటు, వాటికి విస్తృత అధికారాలు ఇవ్వడానికి రాజ్యాంగం ప్రాధాన్యం ఇచ్చింది. పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామాల అభివృద్ధికి ఆ గ్రామ ప్రజలే పాటుపడటానికి వీలు కల్పించారు. ప్రాచీన కాలంలో పనిచేస్తున్న గ్రామపాలన వ్యవస్థ అప్పటి సాంఘిక పరిస్థితులకు అనుగుణంగా అయిదు ప్రధాన వృత్తుల ప్రతినిధులతో పనిచేసేది. అయితే ఇది ఎక్కువగా అణిచివేతకు గురయ్యేది. బ్రిటిష్ పాలనా ప్రారంభంలో అంతగా ఆదరణకు నోచుకోకపోయినప్పటికీ జనరల్ గవర్నర్ ‘రిప్పన్’ ప్రోత్సాహంతో స్థానిక స్వపరిపాలనా సంస్థలు పునరుజ్జీవనం పొందాయి. 1919, 1935 భారత ప్రభుత్వ చట్టాలు కొంతమేరకు వీటికి బలాన్ని చేకూర్చాయి. భారతదేశంలో మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రారంభించిన తొలి రాష్ట్రం రాజస్థాన్ కాగా, ఆంధ్రప్రదేశ్ రెండోది. 1959 నవంబరు 1న ఆంధ్రప్రదేశ్లోని మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో ఈ వ్యవస్థను ప్రారంభించారు. 73వ రాజ్యాంగ సవరణకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1994లో కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని చేసింది. ప్రస్తుత వ్యవస్థ దీనికి అనుగుణంగా ఉంది.కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ రాష్ట్రాల మంత్రిత్వ శాఖలతో దీనికి సంబంధించిన కార్యక్రమాలను చేపడుతుంది. ఏప్రిల్ 24ను పంచాయతీరాజ్ దినంగా పాటిస్తున్నారు. దాదాపు 30 లక్షల మంది ప్రజాప్రతినిధులతో నడుస్తున్న పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ. ప్రధానంగా మన గ్రామాలకు ఇది వెన్నెముకగా పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా 537 జిల్లాపంచాయతీలు, 6097 మండల పంచాయతీలు, 2,34,676 గ్రామపంచాయతీలు పనిచేస్తున్నాయి. జిల్లా పంచాయతీ స్థాయిలో 11,825 మంది ప్రతినిధులు, మండల పంచాయతీ స్థాయిలో 1,10,070 మంది ప్రతినిధులు, గ్రామపంచాయతీ స్థాయిలో 20,73,715 మంది ప్రతినిధులు ఓటర్ల ద్వారా ఎన్నికయ్యారు.

పంచాయతీరాజ్ ఎందుకు?

వనరుల పంపిణీలను మెరుగుపరచడానికి.ప్రభుత్వ పనుల్లో స్థానికులు పాల్గొనేలా చేయడానికి.గ్రామీణ ప్రజల దైనందిన అవసరాలను మేలైన పద్ధతిలో తీర్చడానికి.స్థానికంగా అధికంగా ఉద్యోగాలు కల్పించడానికి.పేదరిక నిర్మూలన కార్యక్రమాలను అమలు చేయడానికి.

పంచాయతీలకు వాస్తవమైన అధికారాలను అందిస్తే స్వావలంబన, స్వీయ చొరవను, సహకారాన్ని పెంపొందించి గ్రామీణ సమాజ రూపురేఖలను మార్చడానికి దోహదం చేస్తాయి. ప్రజలు పాల్గొనే ప్రజాస్వామ్యానికి రూపకల్పన చేస్తాయి. పంచాయతీరాజ్ వ్యవస్థ వల్ల ప్రతి చిన్న పనికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆధారపడటం జరగదు. కేంద్ర, రాష్ట్ర పాలనా యంత్రాంగంపై అధిక పనిభారాన్ని, ఒత్తిడిని తగ్గించడం. ఆలస్యాన్ని నివారించి ప్రజల సమస్యలపై ప్రభుత్వం త్వరగా స్పందించేలా చేయడం. సేవల పరిమాణాలను పెంచడం, వికేంద్రీకరణ పంచాయతీరాజ్ ముఖ్య ధ్యేయాలు.

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థ:

ప్రజలందరూ అధికారంలో పాలుపంచుకోవడాన్ని ప్రజాస్వామ్య పరిపాలన అంటారు. పరిపాలన వికేంద్రీకరణతోనే దేశంలో పాలన సమర్థంగా సాగుతుంది. పరిపాలనా సౌలభ్యం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పనిభారాన్ని తగ్గించి స్థానిక సంస్థలను ఏర్పాటు చేయాలి. సమాజ వికాస ప్రయోగాలు, జాతీయ విస్తరణ సేవా పథకాల అమలు తీరును పర్యవేక్షించి, తగిన సూచనలు ఇవ్వడానికి 1957 జనవరిలో ప్రణాళికా ప్రాజెక్టు కమిటీ ‘బల్వంతరాయ్ గోపాల్ మెహతా కమిటీ’ని నియమించింది. ఈ కమిటీ తన నివేదికను 1957 నవంబరులో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించగా 1958 జనవరిలో జాతీయాభివృద్ధి మండలి దాన్ని అంగీకరించింది.

పంచాయతీరాజ్ సంస్థల విధులు:

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాస్థాయిలో నిర్వహించే అభివృద్ధి సంబంధ విధులన్నింటిని జిల్లా పరిషత్తులకు అప్పగించాలి.ఈ విధంగా వికేంద్రీకరించాల్సిన వాటిలో వ్యవసాయం, దానికి సంబంధించిన విధులు, ఆరోగ్యం, విద్య, రోడ్లు, గ్రామీణ పరిశ్రమలు, వెనుకబడిన తరగతుల సంక్షేమం మొదలైన విధులను కమిటీ ప్రత్యేకంగా పేర్కొంది.జిల్లాస్థాయికి వికేంద్రీకరించిన రాష్ట్ర కార్యక్రమాలు, ప్రణాళికా రూపకల్పనను జిల్లా పరిషత్తుకు అప్పగించగా, వాటి అమలును మండల పంచాయతీలకు అప్పగించారు.అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొనేలా చేసే పౌరసేవా విధులు, సంక్షేమానికి సంబంధించిన విధులను కూడా మండల పంచాయతీకి అప్పగించారు.రెవెన్యూ, శాంతి భద్రతల లాంటి విధులు కలెక్టర్ వద్దనే ఉండాలనీ, అభివృద్ధి పనులకు అవసరమైనంత వరకు మాత్రమే అవి పంచాయతీరాజ్ వ్యవస్థలకు ఇవ్వాలనీ అశోక్ మెహతా కమిటీ సూచించింది.జిల్లాస్థాయిలో ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన పనులను మొత్తం జిల్లా పరిషత్తుకే అప్పగించాలి. జిల్లా పరిషత్తు అభివృద్ధి శాఖల అధికారులు దానికే చెందిన ప్రధాన కార్యనిర్వహణాధికారి ఆధీనంలో ఉండాలి.ప్రతి మండల పంచాయతీలో వ్యవసాయ విస్తరణాధికారి, పశుపోషణ, చేపల పెంపకం, చిన్నతరహా పరిశ్రమలు, ఆరోగ్య శాఖలకు సంబంధించిన ఉద్యోగులందరూ ఒక పూర్తికాల పంచాయతీ మండల కార్యనిర్వహణాధికారి ఆధీనంలో ఉండాలి.

పంచాయతీరాజ్ వ్యవస్థకు నిధులు:

పంచాయతీలకు గ్రామపరిధిలో చేపట్టదలచిన అభివృద్ధికి అవి రూపొందించిన ప్రతిపాదనల ఆధారంగా నిధులు మంజూరు అవుతాయి.జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా గ్రామాల్లో ఆయా పాలక వర్గాలు ప్రతిపాదించిన పనులకు పంచాయతీల ఖాతాలకే నేరుగా నిధులు లక్షల్లో చేరుతాయి.పాలక వర్గాల అభీష్టం మేరకు నిధులు మంజూరు అవుతాయి.ఒక్కో గ్రామ పంచాయతీకి 5.5 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకు ఉపాధి హామీ నిధులు పంచాయతీ ఖాతాలకు చేరతాయి.రాష్ట్రంలోని 21 వేల పంచాయతీలకు ఈ మొత్తాన్ని అందించనున్నారు. గ్రామసభ అభీష్టం మేరకు లింకు రోడ్లు, పక్కా డ్రెయిన్లు, ప్రధాన రహదారుల నిర్మాణానికి ఈ నిధులను వెచ్చించుకోవచ్చు.12వ ఆర్థిక సంఘం నిధులు మినహా ప్రభుత్వం నుంచి పంచాయతీలకు మరే ఇతర గ్రాంట్లు అందలేదు.

ఈ నిధులను కేవలం మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం పనులకు మాత్రమే వినియోగించాలనే నిబంధన వల్ల చాలా గ్రామాల్లో రహదార్లు, డ్రెయిన్ల పనులు నిలిచిపోయాయి.గతంలో మార్కెటింగ్ నిధులతో రహదారులు నిర్మించినప్పటికీ గడిచిన 8 ఏళ్లుగా ఆ పనులకు ప్రభుత్వం అంగీకరించలేదు. మరోపక్క స్థానిక నిధులతో సిబ్బంది జీతభత్యాలు, విద్యుత్ సామగ్రి తదితర అవసరాలు తీరుతున్నాయి. ఈ దశలో ఎన్.ఆర్.ఇ.జి.ఎస్. నిధులను నేరుగా పంచాయతీలకు అందివ్వాలని ప్రభుత్వం సంకల్పించింది.

పంచాయతీరాజ్ ఆర్థిక వనరులు:

పంచాయతీరాజ్ సంస్థలకు కొన్ని తప్పనిసరి పన్ను విధించే అధికారాలను బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ కల్పించింది. అవి: ఇంటిపన్ను, వృత్తిపన్ను, వినోదపు పన్ను. ఇంటిపన్ను, వృత్తిపన్ను, వినోదపు పన్నులే కాకుండా వీధి దీపాలు, పరిశుభ్రత, నీటి సరఫరా లాంటి వాటిపై ఫీజుల విధింపు, స్టాంపు డ్యూటీ లాంటి మరికొన్నింటికి సంబంధించి పన్నులను విధించాలని, ఇవన్నీ కాకుండా తలసరి రూ. 2.50 చొప్పున మండల పంచాయతీలకు రాష్ట్రప్రభుత్వం గ్రాంట్లు మంజూరు చేయాలని బల్వంత్‌రాయ్ మెహతా కమిటీ సూచించింది.

ఆంధ్రప్రదేశ్లో గ్రామ పాలన….

రాష్ట్రంలో పూర్వకాలంలో కరణం, మునసబు, పట్వారీ, పటేల్ లాంటి గ్రామాధికారుల వ్యవస్థ అమల్లో ఉండేది. వీరు ఆయా గ్రామాల్లో స్థిర నివాసం ఉంటూ పాలనా వ్యహహారాలను చూసుకునేవారు. ప్రభుత్వం 1985లో వీరిని తొలగించి, గ్రామ పాలనాధికారుల (వి.ఎ.ఒ.) విధానాన్ని ప్రవేశపెట్టింది. పంచాయతీలను రెవెన్యూ వ్యవస్థ నుంచి వేరు చేసిన నేపథ్యంలో 2007 ఫిబ్రవరి నుంచి వి.ఆర్.ఒ. విధానం అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో ప్రతి 5,000 జనాభాకు ఒక్కరు; 5,000 – 10,000 జనాభాకు ఇద్దరు; 10,000 – 15,000 జనాభాకు ముగ్గురు చొప్పున గ్రామ రెవెన్యూ అధికారులను (వి.ఆర్.ఒ.) నియమించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ పంచాయతీ కార్యదర్శులను వి.ఆర్.ఒ.లుగా తీసుకున్న నేపథ్యంలో వారందరినీ ‘ఎక్కడివారు అక్కడే’ అన్న పద్ధతిలో ఉంచేశారు. ఫలితంగా కొన్ని చోట్ల ఉండాల్సినవారి కంటే ఎక్కువమంది, కొన్ని చోట్ల తక్కువమంది, మరికొన్ని చోట్ల అసలు లేని పరిస్థితి ఏర్పడింది. ఈ అసమానతల కారణంగా ప్రజలకే కాకుండా పాలనాపరంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సమస్యను గుర్తించిన ప్రభుత్వం వీఆర్వోలను సొంత గ్రామాలకు బదిలీ చేయడాన్ని నిలిపేసింది. జిల్లాల్లో ఖాళీగా ఉన్న వి.ఆర్.ఒ. పోస్టులను సంబంధిత జిల్లా ఎంపిక కమిటీ భర్తీ చేస్తుంది. కొన్ని గ్రామాలను కలిపి ఒక సముదాయం (క్లస్లర్)గా ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 12,397 క్లస్టర్లకు 17,008 వి.ఆర్.ఒ.ల అవసరం ఉంది. ప్రస్తుతం 14,800 మంది వి.ఆర్.ఒ.లు ఉన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రంలోని 21,943 గ్రామ పంచాయతీలను 12,397 క్లస్టర్లుగా ఏర్పాటు చేశారు. 5,000 జనాభా ఉన్న రెండు, మూడు పంచాయతీలను ఒక క్లస్టరుగా ఏర్పాటు చేశారు. ప్రతి క్లస్టరుకు ఒక కార్యదర్శిని నియమించాలి. ప్రతి క్లస్టర్ 5 కిలోమీటర్ల పరిధిలో ఉండాలి. ప్రతి కార్యదర్శికి ఒక పెద్ద పంచాయతీ లేదా ఏడు చిన్న పంచాయతీలను అప్పగించాలి. ఏజెన్సీ ప్రాంతంలో ప్రజలు గ్రామ కార్యదర్శిని కలవాలంటే 40-50 కిలోమీటర్లు ప్రయాణించాలి. అడవుల మధ్యలో ఉండే చిన్న పంచాయతీలకు వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యాలు లేవు. కనీసం గ్రామానికి ఒక కార్యదర్శి చొప్పున ఉండాలంటే గతంలో మాదిరిగా పంచాయతీ, రెవెన్యూ శాఖలను ఏకం చేయాలి. మన రాష్ట్రంలో 1127 రెవెన్యూ మండలాలు, 1094 మండల పరిషత్‌లు, 21,943 గ్రామ పంచాయతీలు, 28,124 రెవెన్యూ గ్రామాలు, 26,614 నివాసిత గ్రామాలు, 1510 నివాసాలు లేని గ్రామాలు ఉన్నాయి.

గ్రామ పంచాయతీ…….

ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామ పంచాయతీలు 1964లో రూపొందించిన చట్టాన్ని అనుసరించి పనిచేస్తున్నాయి. చట్టరీత్యా కమీషనర్ అనే అధికారి (జిల్లా కలెక్టర్) ఒక రెవెన్యూ గ్రామం లేదా దానిలోని ఏదైనా ఒక భాగాన్ని గ్రామ పంచాయతీగా సృష్టించవచ్చు. 500కు పైగా జనాభా ఉన్న ప్రతి గ్రామానికి ఒక ‘గ్రామ పంచాయతీ’ ఉంటుంది. గ్రామ పంచాయతీలు అమల్లోకి వచ్చినప్పటి నుంచి ప్రతి గ్రామానికి ఒక ‘గ్రామ సభ’ కూడా అమల్లోకి వచ్చింది. గ్రామంలోని ఓటర్లు అందరూ ఆ గ్రామ సభలో సభ్యులుగా ఉంటారు.

[fusion_tb_related related_posts_layout=”title_below_image” hide_on_mobile=”small-visibility,medium-visibility,large-visibility” heading_enable=”yes” heading_size=”3″ animation_direction=”left” animation_color=”” animation_speed=”0.3″ animation_delay=”0″ /]

We Love to hear your comments